నిపా వైరస్ కి నిజంగా మందు లేదు…అదే పెద్ద భయం
ప్రస్తుతం భారత దేశాన్ని వణికిస్తున్న వైరస్ నిపా. ఇది సోకితే చావు తప్పదు. దీనికి ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా మందు కనుగొనలేదు. అదే అందరికీ అందోళన కల్గిస్తున్న అంశం. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే కేరళ రాష్ట్రంలో 10 మందికి మృత్యువాతపడ్డారు. ఈ తరహా వైరస్ను తొలిసారి దక్షిణభారత డేశంలో కనుగొనడం ఇదేతొలిసారి. అసలు ఈ వైరస్ పుట్టుపూర్వోత్తరాలేమిటని తెలుసుకుంటే….?
ఈ నిపా వైరస్ను తొలిసారి 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్లోనూ ఈ వైరస్ ను గుర్తించారు. పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. మలేసియాలోని నిపా ప్రాంతానికి చెందిన వారిలో తొలిసారిగా ఈ వైర్సను కనుగొన్నారు. దీంతో ఈ వైరస్కు నిపాగా నామకరణం చేశారు. ఈ వైరస్ను తొలిసారి పందుల్లో గుర్తించారు.
ఆ తర్వాత 2004లో బంగ్లాదేశ్లో కూడా ఈ వైరస్ ప్రబలి, మరణాలు సంభవించాయి. అనంతరం దేశంలో పశ్చిమ బెంగాల్లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్ వెలుగుచూసింది. నిపా వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి.
ఈ వైరస్ బారినపడిన వారికి జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్సెఫలైటిస్, మయోకార్డైటిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్ లేదు. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటివి ఈ వైరస్ వ్యాప్తికి వాహకాలుగా పనిచేస్తున్నాయి.
తప్పనిసరి జాగ్రత్తలివీ
* వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండటం.
* నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే పండ్లను ఆరగించాలి.
* మామిడి పండ్ల సీజన్లో చిన్నపిల్లల ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచడం.
* ఇంటితోపాటు.. ఇంటిలోని వస్తువులు శుభ్రంగా ఉంచడంతో పాటు.. మూతలు వేసివుంచడం.
సమిధగా మారిన నర్స్ లినీ
ప్రస్తుతం కేరళలో తలెత్తి దేశమంతా ఆందోళన కల్గిస్తున్న నిపా వైరస్ రోగులకు వైద్య సేవలు అందిస్తున్న నర్సు లినీ అదే వైరస్ సోకి మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి వృత్తి ధర్మం నిర్వర్తించి ఆ వైరస్ కి ఒక సమిధగా బలైపోయిన సిస్టర్ లినీ పుత్తుస్సెరీకి అంజలి ఘటిస్తోంది.
తాను చనిపోక తప్ప్దని తెలుసుకుని చనిపోయే ముందు లినీ (31) తన భర్తకు రాసిన ఉత్తరాన్ని బట్టి.. మరణానికి సిద్ధపడే, నర్సుగా ఆమె తన సేవలను కొనసాగించడానికి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది!‘‘నేను నిన్ను మళ్లీ కలుసుకుంటానని అనుకోవడం లేదు. పిల్లలు జాగ్రత్త. నీతో పాటు గల్ఫ్ తీసుకెళ్లు. ఎవరికి వారుగా ఒంటరిగా ఉండకండి’’ అని ఉత్తరంలో రాసిన కొద్ది రోజులకే లినీ తన కుటుంబ సభ్యులందరినీ ఒంటరివారిని చేసి, మొన్న సోమవారం మృత్యువు ఒడిలోకి వాలిపోయింది.లినీతో కలిపి ఇప్పటి వరకు ఇండియాలో నిపా వైరస్ సోకి మృత్యువాత పడిన వారి సంఖ్య 10కి చేరింది. విషాదం ఏమిటంటే.. నిపా రోగులకు సేవలు అందించడానికి కోళికోడ్ దగ్గరి పెరంబ్రా ఆసుపత్రిలో నర్సుగా చేరిన లినీ కూడా రోగుల నుంచి ఆ వ్యాధి సోకి మరణించడం! లినీకి ఇద్దరు చిన్నపిల్లలు. భర్త గల్ఫ్లో ఉంటాడు. ఆదివారంనాడు నిపా వైరస్తో కోళికోడ్లో ఇద్దరు, మలప్పురం జిల్లాలో నలుగురు మరణించడంతో అప్పటి వరకు సంభవించిన మూడు నిపా మరణాలతో కలిపి ఈ సంఖ్య తొమ్మిదికి చేరగా, పెరంబ్రా ఆసుపత్రిలో కొన్నాళ్లుగా నిపా రోగులకు సేవలు అందిస్తున్న లినీ మృతితో ఆ జాబితా పదికి చేరింది. నిపా వైరస్కు మనిషి నుంచి మనిషికి వ్యాపించే స్వభావం ఉండడంతో నర్సు లినీ మృతదేహాన్ని పెరువన్నముళి సమీపంలోని చెంబనోడా ప్రాంతంలో ఉన్న ఆమె స్వగ్రామానికి తరలించలేకపోయారు.
కుటుంబ సభ్యుల అనుమతితో కేరళ ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుని కోళికోడ్లోనే ఒక విద్యుత్ శ్మశానవాటికలో లినీ అంత్యక్రియల్ని నిర్వహించింది. లినీ జబ్బున పడిందన్న సంగతి తెలిసిన ఆమె భర్త సజీశ్ రెండు మూడు రోజుల క్రితమే కేరళ వచ్చాడు కానీ, వైద్యులు అతనిని లినీని కలవనివ్వలేదు. పిల్లలు సిద్ధార్థ్ (5), రితుల్ (2) కూడా అమ్మ ముద్దుకైనా నోచుకోలేదు. నిపా వైరస్తో చంగరోత్ ప్రాంతం నుంచి పెరంబ్రా ఆసుపత్రిలో చేరిన ఒక యువకుడికి మాత్రమే అతడి చివరి రోజులలో నర్సుగా లినీ ఆప్యాయత అందింది. ఆ తర్వాతి నుంచీ లినీలో ఆ జబ్బు లక్షణాలు కనిపించడం మొదలైంది. లినీకి కూడా ఈ వైరస్ సోకిందని నిర్ధారించుకున్న వెంటనే ఆమె భర్తకు వైద్యాధికారులు సమాచారం పంపించారు. అయితే అంతకంటే ముందే లినీ తన అంతిమ ఘడియల్ని పసిగట్టి భర్తకు ఉత్తరం రాశారు. నిపా వైరస్ నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల వ్యవధిలో మానవదేహంలో వృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు అతి సమీపంలో ఉండి సేవలు అందించిందన్న కనికరం కూడా లేకుండా లినీని కూడా ఒక మామూలు రోగిలానే మృత్యువు కబళించింది.
లినీ అంత్యక్రియలకు కేరళ పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ హాజరయ్యారు. లినీ తన భర్తకు రాసిన ఉత్తరాన్ని ఆయనే తన ఫేస్బుక్లో పెట్టారు. లినీ మొదట కోళికోడ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. గత సెప్టెంబరులో పెరంబ్రా తాలూకా ఆసుపత్రి కాంట్రాక్టుపై ఆమెను నియమించుకుంది. లినీ మరణానికి సంతాపంగా సోమవారం నాడు పెరంబ్రా ఆసుపత్రి సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ‘యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్’ లినీ త్యాగనిరతిని ఆవేదనతో స్మరించుకుంది. ఈ వైరస్ తీవ్రత ఇలాగే ఉంటే మరికొంతమంది వైద్య సిబ్బంది దానికి బలికాక తప్పదనే భయం అందర్నీ వెంటాడుతోంది.